భారత్‌ వృద్ధికి యుద్ధం బ్రేక్‌ | West Asia Conflict Threatens India Growth Oil Shock Could Drag GDP | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధికి యుద్ధం బ్రేక్‌

May 6 2026 8:26 AM | Updated on May 6 2026 8:57 AM

West Asia Conflict Threatens India Growth Oil Shock Could Drag GDP

6.5 శాతంలోపునకు జీడీపీ వృద్ధి

ధరలు పెరిగిపోయే రిస్క్‌

సీఐఐ, ఏడీబీ అంచనా 

పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్‌ వృద్ధికీ అతిపెద్ద రిస్క్‌గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7  శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.

పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా.  

వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..

వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్‌ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.  

వృద్ధి 6.3 శాతమే: ఏడీబీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్‌ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్‌ పార్క్‌ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్‌ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్‌లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్‌ తెలిపారు. చమురు, గ్యాస్‌ కోసం దిగుమతులపై భారత్‌ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.

ఎల్‌నినో ప్రభావం

ఎల్‌నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్‌లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్‌లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్‌లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్‌ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement