Washington Post Announces Single Digit Percentage Layoffs - Sakshi
Sakshi News home page

లైవ్‌లో తొలగింపు..ఉద్యోగుల ఫ్రస్టేషన్‌తో జడుసుకున్న దిగ్గజ సంస్థ సీఈవో!

Dec 16 2022 4:36 PM | Updated on Dec 16 2022 6:35 PM

Washington Post Announces Single Digit Percentage Layoffs - Sakshi

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సీఈవో మీటింగ్‌ పెట్టి ఫైర్‌ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.అంతేకాదు తమని ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించిన ఉద్యోగుల ఫ్రస్టేషన్‌ దెబ్బకు జడుసుకొని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం లైవ్‌ ‘లే ఆఫ్స్‌’కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.  

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఈకామర్స్‌ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లోపనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ ర్యాన్ ఆఫీస్‌ మీటింగ్‌లో తెలిపారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులతో సీఈవో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో  2,500మంది పనిచేస్తున్న సంస్థలో సింగిల్‌ డిజిట్‌ పర్సంటేజ్‌ సిబ్బందిని ఫైర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

తొలగించిన వారి స్థానాల్ని భర్తీ చేసేలా మరికొంత మందిని నియమించుకుంటామని, ఉద్యోగుల సంఖ్య తగ్గదని ర్యాన్ పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగాల కోత మా ఆశయాలకు వ్యతిరేకం కాదు. కానీ మా కస్టమర్ల అవసరాలను తీర్చని కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.  

ప్రకటనలపై ఆధారపడే కంపెనీలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడమే ఉద్యోగుల తొలగింపులకు కారణమని కంపెనీ పేర్కొంది. ర్యాన్‌ తొలగింపుల ప్రకటనపై కంపెనీ ఉద్యోగులు మూకుమ్ముడిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కానీ ఉద్యోగుల తీరుతో జడుసుకున్న సీఈవో రిప్లయి ఇవ్వకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు.

సమావేశంలో ఉద్యోగుల ప్రశ్నలకు రిప్లయి ఇచ్చేందుకు సీఈవో ర్యాన్ ఎందుకు నిరాకరించారో వాషింగ్టన్ పోస్ట్ గిల్డ్ (సంఘం) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తన ఏ నాయకుడికి ఆమోదయోగ్యం కాదు. కానీ పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రధాన విలువలు కలిగిన వార్తా సంస్థ నాయకుడు ర్యాన్‌ అని గిల్డ్ పేర్కొంది. 

కొద్ది వారాల క్రితం వాషింగ్టన్ పోస్ట్ వీక్లీ మ్యాగజైన్‌ను క్లోజ్‌ చేసింది.11 మంది న్యూస్‌రూమ్ ఉద్యోగులపై కోత విధించింది. ఆ ప్రకటన చేసిన కొద్ది వారాల తర్వాత..తాజాగా ఆర్థిక ప్రతికూలతల్ని కారణంగా చూపిస్తూ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. పత్రిక వీక్లీ  చివరి మ్యాగజైన్‌ను డిసెంబర్ 25న ప్రచురించబడుతుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement