స్కైట్రాన్‌లో రిలయన్స్‌కు మెజారిటీ వాటాలు

RIL buys majority stake in skyTran - Sakshi

ముంబై: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా టెక్నాలజీ రంగ సంస్థ స్కైట్రాన్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం 26.76 మిలియన్‌ డాలర్లు వెచ్చించింది. తాజా డీల్‌తో స్కైట్రాన్‌లో కంపెనీ వాటా 54.46 శాతానికి పెరిగింది. అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటెజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ (ఆర్‌ఎస్‌బీవీఎల్‌) ద్వారా ఈ డీల్‌ కుదిరినట్లు రిలయన్స్‌ వెల్లడించింది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే రవాణా సాధనాలకు అవసరమైన టెక్నాలజీలను స్కైట్రాన్‌ అభివృద్ధి చేసింది. ఇన్నోవేషన్‌ ఎండీవర్స్‌ వంటి అంతర్జాతీయ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు కూడా దీనికి దన్నుగా ఉన్నారు. 2018లో స్కైట్రాన్‌లో 12.7 శాతం వాటాలు కొనుగోలు చేసిన ఆర్‌ఎస్‌బీవీఎల్‌ ఆ తర్వాత దశలవారీగా దాన్ని 26.31 శాతానికి, ప్రస్తుతం మెజారిటీ స్థాయికి పెంచుకుంది. ‘ప్రపంచాన్ని మార్చేసే భవిష్యత్‌ తరపు టెక్నాలజీలపై ఇన్వెస్ట్‌ చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ డీల్‌ నిదర్శనం. చౌకగా హైస్పీడ్‌ ఇంట్రా, ఇంటర్‌–సిటీ కనెక్టివిటీని అందించేందుకు తోడ్పడే టెక్నాలజీలను రూపొందించడంలో స్కైట్రాన్‌కు అపార సామర్థ్యం ఉంది’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ సందర్భంగా తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top