కొత్త కారు కొనాలనుకునే ప్లాన్ చేస్తున్నారా?, అయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో మీరు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి కారణం ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే.
టాటా మోటార్స్ నుంచి.. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్, ఎంజీ మోటార్, హోండా మోటార్స్ వంటి పలు ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపును ప్రకటించాయి.
బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ధరలను సుమారు 2 శాతం మేర పెంచనున్నాయి. మరోవైపు. టాటా మోటార్స్ టియాగో, నెక్సాన్, సఫారీ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలను రూ.13,000 వరకు పెంచుతోంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. పెరుగుతున్న ఖర్చులు, బలహీనపడుతున్న రూపాయి, అధిక ముడిసరుకుల ధరలు, పెరిగిన రవాణా ఖర్చులు అని సంస్థలు వెల్లడిస్తున్నాయి.


