గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.
యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.
ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.
మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.
భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.
ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక


