తయారీ రంగం మార్చిలో కొంత బలహీనపడింది. ఈ రంగం వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 53.9 పాయింట్లకు పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 56.9గా ఉంది. 2022 జూన్ తర్వాత ఇదే తక్కువ వృద్ధి కావడం గమనార్హం.
తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరల ఒత్తిళ్లకు తోడు తీవ్రమైన పోటీ ఈ పరిస్థితికి దారితీసింది. తమపై పడే వ్యయాల భారాన్ని ధరల పెంపు రూపంలో పూర్తిగా బదిలీ చేసే పరిస్థితుల్లేకపోవడం కంపెనీలపై ప్రభావం చూపించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొత్త ఆర్డర్ల రాకపై ప్రభావం చూపించడం కారణాల్లో ఒకటిగా ఉంది.
హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలను గురువారం విడుదల చేసింది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదలగా చూస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని, ఇవి పరోక్షంగా భారత తయారీదారులపైనా పడుతున్నట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.


