మార్చిలో 5.1 శాతం
పట్టణ ప్రాంతాల్లోనే అధికం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు మార్చి నెలలో స్వల్పంగా పెరిగి 5.1 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా పెరిగింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్లు నిండిన పట్టణ జనాభాలో నిరుద్యోగం ఫిబ్రవరిలో ఉన్న 6.6 శాతం నుంచి మార్చిలో 6.8 శాతానికి చేరింది.
గ్రామీణ మహిళల్లో నిరుద్యోగం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగగా, గ్రామీణ పురుషుల్లో స్వల్పంగా పెరిగింది. కార్మికుల భాగస్వామ్య రేటు మార్చి నెలకు 55.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 55.9 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి మార్చిలో 52.6 శాతం వద్ద స్థిరంగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.5 శాతం, పట్టణాల్లో 46.8 శాతంగా ఉండడం గమనార్హం.


