దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి గత రెండేళ్లుగా భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 నుండి 2026 తొలి త్రైమాసికం వరకు 30.7 బిలియన్ డాలర్లు వచ్చాయి. డిమాండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రియల్టీ సేవల సంస్థ సీబీఆర్ఈ, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం రాబోయే రోజుల్లో భారత రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మార్కెట్ మరింత విస్తరించనుంది. పెద్ద ఎత్తున రీట్స్ లిస్టింగ్కి రానుండటంతో డెవలపర్స్కి నిధుల లభ్యత పెరగనుంది. పరిశ్రమ రుణ రూపంలో సమకూర్చుకున్న నిధుల పరిమాణం 2024–2026 తొలి త్రైమాసికం మధ్య కాలంలో 146 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. ట్రస్టీ షిప్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా సంస్థలు ఈ నిధులను సమకూర్చాయి.
రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..
మొత్తం రుణాల్లో మూడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు వాటా 60 శాతం పైగా ఉంది. ప్రథమ శ్రేణిలోకి రాని నిర్దిష్ట నగరాల వాటా 8 శాతంగా ఉంది. మెట్రోల పరిధి దాటి ఇతర ప్రాంతాలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం.
కమర్షియల్ రియల్ ఎస్టేట్కి బ్యాంకు రుణాలు 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి. ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాలు 2025 సెప్టెంబర్ నాటికి అయిదేళ్ల గరిష్ట స్థాయి అయిన రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్తకు రీట్స్ కీలకంగా మారుతున్నాయి.
దేశీయంగా పెట్టుబడులు స్థిరంగా వస్తుండటం, భౌగోళికరాజకీయ అనిశి్చతుల నడుమ గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండటంలాంటి అంశాలు పెట్టుబడుల రాకకు దోహదపడనున్నాయి. ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ మొదలైన వాటిల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి అవకాశాలు ఉన్నాయి.
ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా అనిశి్చతిలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ నిర్మాణాత్మకంగా పరివర్తన చెందుతుండటం, పారదర్శకత మెరుగుపడుతుండటం, వివిధ వనరుల ద్వారా నిధులు లభిస్తుండటంలాంటి అంశాల వల్ల పెట్టుబడులకు రియల్టీ రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగనుంది.


