కోల్గేట్‌ ఇండియా నుంచి  కొత్త బ్రాండ్లు  | Colgate Palmolive to introduce more brands in India | Sakshi
Sakshi News home page

కోల్గేట్‌ ఇండియా నుంచి  కొత్త బ్రాండ్లు 

Jun 24 2025 6:31 AM | Updated on Jun 24 2025 9:41 AM

Colgate Palmolive to introduce more brands in India

అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియో నుంచి విడుదల 

వృద్ధికి బలమైన అవకాశాలున్నాయి 

సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్‌

న్యూఢిల్లీ: కోల్గేట్‌ (పామోలివ్‌) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్‌ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్‌ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్‌ తెలిపారు. 

ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్‌ బ్రాండ్‌పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్‌ వాష్‌ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. 

పామోలివ్‌ బ్రాండ్‌పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్‌ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే కోల్గేట్‌ పామోలివ్‌ 88 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్‌ నుంచే వస్తోంది. 

భారత మార్కెట్‌ ఎంతో కీలకం 
140 కోట్ల జనాభా కలిగిన భారత్‌ మార్కెట్‌.. కోల్గేట్‌ పోమోలివ్‌ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్‌ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్‌ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్‌కు అంతర్జాతీయంగా టాప్‌–5 మార్కెట్లలో భారత్‌ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్‌లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్‌ కామర్స్‌ చానళ్లపై మరిన్ని డిజిటల్‌ ఫస్ట్‌ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్‌ తెలిపారు.

 కోల్గేట్‌ పర్పుల్, మ్యాక్స్‌ ఫ్రెష్‌ సెన్సోరీస్‌ శ్రేణి, మౌత్‌ వాష్‌లను కోల్గేట్‌ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్‌కామర్స్‌ ఛానళ్లకు అనుకూలంగా ఆన్‌లైన్‌లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్‌ పోమోలివ్‌ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.

వినియోగం పుంజుకుంటుంది.. 
ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్‌ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్‌ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్‌ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్‌ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్‌ మార్కెట్‌తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement