Bullet Bandi: బుల్లెటు బండి ! ఆ డుగ్‌ డుగ్‌ వెనుక కథ ఇదేనండి !!

Bullet Bandi Royal Enfield 10 Things You Need To Know - Sakshi

'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని'  అంటూ పెళ్లి బరాత్‌లో నవ వధువు చేసిన డ్యాన్స్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. అంతకు ముందు నాలుగేళ్ల కిందట యూత్‌లో సంచలనం రేపి అర్జున్‌రెడ్డి మూవీ బుల్లెట్‌ డుగ్‌ డుగ్‌ సౌండ్స్‌తోనే మొదలవుతుంది. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమా బుల్లెట్‌ సాంగ్‌లో అయితే ‘వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు’ అంటూ సాహిత్యం కొససాగుతుంది. ఇంతగా హల్‌చల్‌ చేస్తున్న ఆ బుల్లెట్‌ బండి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటీ ? దాని సౌండు వెనుక ఉన్న కథాకమామీషులేంటో మీకు తెలుసా...! 

మోటార్‌ సైకిళ్ల చరిత్ర చాలా పెద్దగానే ఉంది. మోటార్ బైక్‌లను తొలిసారి గా ఫ్యుగోట్‌ కంపెనీ తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రెండో బైక్‌ తయారీ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం బుల్లెటు బండిని ఐషర్‌ మోటర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్ధ అయిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ తయారుచేస్తోంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ పేరులోనే ఒక రాజసం ఉంది. ఎక్కువగా రాజకీయనాయకులు ఈ బైక్లపై తిరుగుతుంటారు. కచ్చితంగా బుల్లెటు బైక్‌ను సొంతం చేసుకోవాలనే మోజు, క్రేజు యూత్‌లో నెలకొంది. బుల్లెటు బైక్ ఇంగ్లాండ్‌కు చెందిన రెడ్‌డిచ్‌  ఎన్‌ఫీల్డ్‌ మోటార్స్‌ కంపెనీ ఈ బైక్‌ను రూపొందించింది‌. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 

చెన్నైలో ప్లాంట్‌
ఇండియాలో బ్రిటిష్‌వాళ్ల రాకతో వారి పరిపాలనలో రాజసానికి చిహ్నంగా ఈ బైక్‌ను భారత్‌లోకి తెచ్చారు. తొలి దశలో ఇంగ్లండ్‌ నుంచి ఈ బైకులను ఇండియాకు తెప్పించారు. ఆ తర్వాత 1947 స్వాతంత్ర్యం వచ్చాక ఆర్మీ జవాన్లు గస్తీకాయడం కోసం బుల్లెట్‌ బైక్‌ను ఎంచుకోవాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇంగ్లాండ్‌ నుంచి బుల్లెటు బైకులను తీసురావడానికి ఖర్చు ఎక్కువగా అవుతుండడంతో  చెన్నైలో తయారీ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించారు. అలా 1952లో చైన్నెకు చెందిన  మద్రాస్‌ మోటార్స్‌ ఇంగ్లాండ్‌కు చెందిన  రెడ్‌డిచ్‌ కంపెనీ భాగస్వామ్యంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇండియాను స్థాపించారు.350 సీసీ ఇంజన్‌ సామర్థ్యంతో బుల్లెట్‌ బ్రాండ్‌ నేమ్‌తో బైకులు తయారు చేయడం మొదలెట్టింది రాయల్‌ఎన్‌ఫీల్డ్‌.

మొదటి బైక్‌ బుల్లెట్‌
భారత్‌లో మొట్టమొదటిసారిగా తయారై మార్కెట్‌లోకి వచ్చిన బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వారి బుల్లెట్‌ బండే. అప్పట్లో భారత ప్రభుత్వం సుమారు 800 బుల్లెట్లను ఆర్మీ కోసం ఆర్డర్‌ చేసింది. మొదట్లో ఇంగ్లండ్‌ నుంచి విడిభాగాలు తెప్పించుకుని ఇండియాలో తయారు చేసేవారు. 1962 నాటికి అన్నిభాగాలు ఇండియాలోనే తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పటికీ ఇండియన్‌ ఆర్మీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థనే బైకులను సరఫరాచేస్తోంది. హిమాలయ, ఈశాన్య భారతంలో ఆర్మీ గస్తీ విధుల్లో బుల్లెట్టు బండిది కీలకం.

మేడ్‌ లైక్‌ ఏ గన్‌ గోస్‌ లైక్‌ ఏ బుల్లెట్‌
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ బైక్లను పరిచయం చేయడానికి ముందు రెడ్‌డిచ్‌  ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ లాన్‌ మూవర్స్‌ను కంపెనీ తయారుచేసేది. అంతేకాకుండా తుపాకులను,ఫీరంగులను తయారుచేసేది. 19వ శతాబ్ధంలో యూరప్‌లో యుద్దాలు నిరంతరం జరుగుతుండేవి. అందులో పలు దేశాలకు రైఫిల్స్‌, స్పోర్టింగ్‌ గన్‌లను కూడా ఈ సంస్థనే సరఫరా చేసింది. వీటి నుంచే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ ట్యాగ్‌  వచ్చింది. అదే.. ‘మేడ్‌ లైక్‌ ఏ గన్‌..గోస్‌ లైక్‌ ఏ బుల్లెట్‌..బిల్ట్‌ లైక్‌ ఏ గన్‌’ 

బడ్జెట్‌ బుల్లెట్‌ పేరు ఇదే
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల సౌండ్‌ ఎంత గొప్పగానో ఉంటుంది కానీ మైలేజీ చాలా తక్కువ.  ఎక్కువగా ఇంధనాన్ని తాగేవి. దీంతో హీరో స్ల్పెండర్‌డర్‌ తరహాలో టారస్‌ పేరుతో ఎకానమీ బైకును కూడా మార్కెట్‌లోకి తెచ్చి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.  ఈ బైక్‌  సింగిల్‌ సిలిండర్‌, 325సీసీ డిజిల్‌ ఇంజన్‌ వేరియంట్‌తో పని చేస్తూ 6.5బీహెచ్‌పీ సామర్ధ్యంతో 15ఎన్‌మ్‌ టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేసేది. ఈ బైక్‌ లీటర్‌ డిజీల్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీ  ఇచ్చేది. టారస్‌ బుల్లెట్‌ మోడల్‌ బైక్‌ సుమారు 12 సంవత్సరాలు పాటు అందుబాటులో ఉంది. మైలేజీ భేషుగ్గా ఉన్నా దీని ధర అధికం కావడంతో ఆశించిన మేరకు సేల్స్‌ జరగలేదు. దీంతో కంపెనీ ఈ మెడల్‌ని డిస్‌కంటిన్యూ చేసింది. 

చెక్కుచెదరని డిజైన్‌
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ట్యాంక్‌పై ఉండే డిజైన్‌ను చైన్నెకు చెందిన కళాకారుడు  రూపొందించాడు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పెట్రోల్‌ ట్యాంకులపై డిజైన్‌ను పూర్తిగా చేతులతోనే వేసేవారు. కాలక్రమేణా బుల్లెట్‌ బైక్‌లకు డిమాండ్‌ పెరగడంతో  బైక్‌ ట్యాంక్‌లపై పిన్‌ స్ట్రిప్‌లను యంత్రాలను ఉయోగించి డిజైన్‌ చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top