లోతట్టు ప్రాంతాల్లో
ఇబ్బంది లేకుండా చర్యలు
కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దుతాం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచరూరల్: విదేశీ పర్యాటకులు వచ్చేలా కిన్నెరసానిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధి కిన్నెరసానిలో వైల్డ్లైఫ్ శాఖ బయోసాట్ నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన జంగల్ సఫారీ టూర్ మూడు వాహనాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లోని గుర్రంగూడ వనమహోత్సం నుంచి వర్చవల్గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అంకిత్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్లతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డీర్ పార్కు వద్ద మొక్కలను నాటి బటర్ ఫ్లై పార్కు, ఫీడ్ స్టోరేజీ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫారీ రైడ్, బటర్ ఫ్లై పార్కు, ట్రెక్కింగ్ అందుబాటులోకి రావడంతో కిన్నెరసానికి వచ్చే పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కొత్తగూడెం క్రాస్ రోడ్డులోని హరిత హోటల్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లక్నవరం తరహాలో కిన్నెరసానిలో కూడా తీగల వంతెన ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కిన్నెరసాని డీర్ పార్కులో ఆయన మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమత్యులతను కాపాడాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అనంతరం కలెక్టర్ పర్యావరణ కేంద్ర భవనాన్ని, బటర్ఫ్లై పార్కును కలెక్టర్ అంకిత్ సందర్శించారు. జంతువులను బొమ్మలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణాగౌడ్, విద్యాచందన, దారా ప్రసాద్, బి.బాబు, కిషన్, కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, కిన్నెరసాని సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, డి. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్: వరదల ప్రభావం అధికంగా ఉండే లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మణుగూరులో పర్యటించిన ఆయన తొలుత భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు కోసం మణుగూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్ట్ ద్వారా భూ రికార్డుల సమగ్రత, పారదర్శకత పెరుగుతుందన్నారు. అనంతరం గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే అన్నారం, కమలాపురం గ్రామాలతో పాటు కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పీకేఓసీ ఓపెన్కాస్ట్ గనుల నుంచి విడుదలయ్యే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే గాంధీనగర్, సుందరయ్యనగర్, కాళీమాత ఏరియాలను సందర్శించారు. వినాయక నగర్ తదితర ప్రాంతాల డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ పల్నాటి వెంకటేశ్వర్లు ఉన్నారు.


