గేదెను బైక్ ఢీకొనడంతో ఘటన
పెనుబల్లి: మండలంలోని లింగగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. లింగగూడెంకు చెందిన స్నేహితులు పద్దం విష్ణు(19), విరపా గోపరాజు ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మరో మిత్రుడు మిడియం శివ(19)ను వీఎం బంజర్లో ద్విచక్రవాహనం ఎక్కించుకున్నారు. ఆపై లింగగూడెం వస్తుండగా ఆకస్మాతుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టి గాలిలో ఎగిరి పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, బైక్ నడుపుతున్న విష్ణు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆతర్వాత మిడియం శివ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక గాయాలైన గోపరాజును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు.


