472 ఫిర్యాదులు వచ్చాయి..
● సత్వర సేవలందిస్తున్న జిల్లా షీ టీమ్ ● రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సొంతం
సూపర్బజార్(కొత్తగూడెం): మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా షీ టీమ్ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళలు, యువతులు, బాలికలకు అండగా నిలబడుతోంది. ఆకతాయిలు, ఇతరులెవరైనా వేధింపులకు పాల్ప డితే నిర్భయంగా సంప్రదించేలా షీ టీం ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందాలను కూడా నియమించారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లకు గురైనా, తప్పుడు మెసేజ్లు వచ్చినా, రాంగ్ కాల్స్తో ఇబ్బంది పెట్టినా, ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినా, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవలని, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేరుగా లేదా 8712682131 నంబర్కు లేదా డయల్ 100కు ఫోన్చేసి సమాచారం అందించి సమస్యలు పరిష్కరించుకోవాలని షీ టీమ్ అధికారులు కోరుతున్నారు.
గతేడాది జిల్లా వ్యాప్తంగా 472 ఫిర్యాదులు స్వీకరించాం. 76 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాం. 346 పెట్టీ కేసులు, 50 కేసులు ఎఫ్ఐఆర్ చేయించి బాధితులకు న్యాయం అందించాం. షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, నూతన చట్టాలు, సైబర్ క్రైమ్స్ తదితర విషయాలపై జిల్లా వ్యాప్తంగా 152 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. –రమాదేవి,
షీ టీం ఎస్ఐ


