రెండో విడత 15వ ఆర్థిక సంఘం
నిధులు విడుదల
15 రోజుల క్రితమే మొదటి విడత
విడుదల
ఈ సారి రూ.17.75 కోట్లు
పంచాయతీ ఖాతాల్లో జమ
పెండింగ్ బిల్లుల చెల్లింపునకు
వెసులుబాటు
పెండింగ్ బిల్లుల చెల్లింపులు
బూర్గంపాడు: నిధుల లేమితో రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన గ్రామపంచాయతీ లకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత డిసెంబర్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు కొలువుదీరటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదలవుతున్నాయి. 2024–25కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 15 రోజుల క్రితం మొదటి విడతగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమయ్యాయి. మళ్లీ రెండో విడత నిధులు కూడా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వెసులుబాటు కలిగింది.
ఏడాదిన్నరపాటు రూపాయి ఇవ్వని ప్రభుత్వాలు
ఏడాదిన్నరపాటుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామపంచాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదు. గ్రామపంచాయతీల్లో అత్యవసర పనులకు పంచా యతీ కార్యదర్శులు అప్పులుచేసి సొంతంగా ఖర్చు చేశారు. అప్పటికే గ్రామాల్లో పనులు చేసిన గత పాలకవర్గాలకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించా ల్సి ఉంది. ఈ పరిస్థితులు పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా పరిణమించాయి. రోజువారీ ట్రాక్టర్ డీజిల్కు, మరమ్మతులకు, బ్లీచింగ్ కొనుగోలుకు, వీధిలైట్ల కొనుగోలుకు ఇతర అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంతంగా ఖర్చుచేశారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరాక తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను కార్యదర్శులు సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు తెలియజేశారు.
గత పాలకవర్గాలకు ఊరట
ప్రభుత్వం నిధులు విడుదల చేయటంతోపాటు ఆ నిధులను పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు విని యోగించాలని ప్రభుత్వం సర్క్యూలర్ విడుదల చేసింది. ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు టైడ్, అన్టైడ్ నిధులుగా విభజిస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన టైడ్ నిధులను కేవలం పెండింగ్ బిల్లులు చెల్లించేందుకే వినియోగించాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యూలర్లో పేర్కొంది. దీంతో గతంలో గ్రామపంచాయతీ పనులకు ఖర్చు చేసిన కార్యదర్శులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ పాలకవర్గ సభ్యులకు ఒకింత ఊరట లభించనుంది. పెండింగ్ బిల్లులు కూడా సీరియల్ ప్రకారం చెల్లించాల్సి ఉంది.
రెండో విడతలో రూ.17.85 కోట్లు
జిల్లాలోని 471 గ్రామపంచాయతీలకు ఇటీవల రూ.11.90కోట్ల ఆర్థికసంఘం నిధులు జమయ్యా యి. ఈ నిధులను పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కొత్త పాలకవర్గాల అనుమతితో చెక్కులు సిద్ధం చేస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. తొలి విడత నిధుల్లో పెండింగ్ బిల్లులు తమకు చెల్లించాలంటే, తమకు చెల్లించాలని పలువురు పోటీ పడుతున్న తరుణంలో రెండో విడత నిధులు విడుదల కావటం కొంత ఊరటనిచ్చినట్లయింది. రెండో విడతగా రూ.17.85కోట్ల నిధులను ప్రభుత్వం గ్రామపంచా యతీ ఖాతాల్లో జమచేసింది. వెంటవెంటనే గ్రామపంచాయతీలకు నిధులు కావటంతో కొత్త పాలకవర్గాలకు పాత బిల్లుల తలనొప్పులు తగ్గనున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాలు ప్రస్తు తం వస్తున్న నిధులు పెండింగ్ బిల్లులకే చెల్లించటంతో కొత్తగా ఏ పనులు చేపట్టలేకపోతున్నామనే ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీలకు రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రెండు విడతలుగా జిల్లాలోని జీపీలకు రూ.29.75 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను సీరియల్ ప్రకారం పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం చేపట్టే అత్యవసర పనులకు ఈ దఫా రానున్న నిధుల్లో బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
–సుధీర్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి


