గద్దెలకు చేరుకున్న సమ్మక్క భర్త
గుండాల: మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతర అనంతరం మాఘమాసంలో సమ్మక్క–పగిడిద్దరాజుల నాగవెళ్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశస్తులు, పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని గుట్ట నుంచి పడగ(జెండా)ల రూపంలో పగిడిద్దరాజును స్థానిక గద్దెల వద్దకు చేర్చారు. తొలుత రాత్రి గర్భగుడి వద్ద ఆభరణాలకు, పడగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో ఊరేగింపు ద్వారా గద్దెలపై ప్రతిష్టించి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వనం(సమ్మక్క దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం జోగుకు వెళ్లి, రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్ల వారుజామున గుడి మెలిగి, దేవతలకు సెలపెయ్యను హారం ఇస్తారు. ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జారతలో భారీగా దుకాణాలు వెలిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బంబోబస్తు ఏర్పాటు చేశారు.
దూలుగొండ ముసలమ్మ జాతర ప్రారంభం
ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ ముసలమ్మ(దేవత) జాతర బుధవారం రోళ్లగడ్డలో ఘనంగా ప్రారంభించారు. ఈసం, మాడె వంశీయులు, పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలతో మండ మెలుగుట, గుడి మెలుగుట కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం దేవతను గద్దెలపై ప్రతిష్టించడంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన సంప్రదాయాలతో గర్భగుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
నేడు అమ్మవారి రాకతో
నిండు జాతర


