ప్రస్తుత సీజన్లో మిర్చి ధరలు (క్వింటాకు రూ.ల్లో)
వారం వ్యవధిలో రూ.వేయి పైకి..
ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా రూ.19 వేలు
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర మళ్లీ కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు జెండాపాట ధర రూ.19వేలుగా పలికింది. వారం క్రితం రూ.18వేలు ఉన్న ధర క్రమంగా రూ.వేయి పెరిగింది. మిర్చి విక్రయాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాగా అప్పట్లో రూ.21,150గా ఉన్నా మళ్లీ తగ్గింది. ఫిబ్రవరి చివరి వారంలో రూ. 18వేలకు పడిపోగా, ఇప్పుడు రూ.వేయి మేర పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
విక్రయాలు పెరుగుతున్న వేళ
సాధారణంగా పంట విక్రయాలు పెరిగితే డిమాండ్తో పాటు ధర తగ్గుతుంది. కానీ ఇప్పుడు పంట విక్రయాలు పెరుగుతున్న వేళ ధర కూడా పుంజుకుంటోంది. పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి కూడా అంతంతే ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలికింది. అప్పుడు పంట సాగు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తి అధికంగా రావడడంతో ఏప్రిల్లో రూ.12 వేల లోపునకు పడిపోయింది.
దేశీయ మార్కెట్ డిమాండ్ ఆధారంగానే..
గత ఏడాది ఖమ్మం మార్కెట్కు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిత్యం లక్ష బస్తాల మిర్చి విక్రయానికి వచ్చేది. కానీ ఇప్పుడు25 వేల నుంచి 30వేల బస్తాలు దాటడం లేదు. ఇక గతంలో మాదిరి విదేశీ ఆర్డర్లు లేకపోవడంతో దేశీయ మార్కెట్లో డిమాండ్ ఆధారంగానే ధరలు నమోదవుతున్నాయి. స్థానిక వ్యాపారులు పంట కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇంకొందరు నాగ్పూర్, కోల్కతా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
తేదీ ధర
ఫిబ్రవరి 24 18,000
ఫిబ్రవరి 25 8,200
ఫిబ్రవరి 26 18,375
ఫిబ్రవరి 27 18,600
మార్చి 02 19,000


