డీఎస్పీ ఆదినారాయణ
చండ్రుగొండ: గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్స్టేషన్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఎస్, స్థానిక పోలీసులు దామరచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. వారిని ఆపి తనిఖీ చేయగా రూ.10.50 లక్షల విలువైన 21.150 కేజీల గంజాయి లభ్యమైంది. విచారించగా ఒడిశాకు చెందిన కారం లక్ష్మయ్య, మరో బాలుడు, విజయవాడకు చెందిన మేకల శ్రీనివాసరావు గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలింది. ఈ సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు.
హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
కరకగూడెం: మండలంలోని వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడులో సీపీఎం నేత కొవ్వాసి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సోమవారం ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సైలు సురేష్, పీవీఎన్ రావు సందర్శించారు. హత్య జరిగిన స్థలాన్ని మరోసారి పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించి గ్రామస్తులను విడివిడిగా విచారించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామంలో సంచరించారా?, హత్యకు వ్యక్తిగత కక్షలేమైనా కారణమా?, ఇతర రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.


