ప్రజా ప్రభుత్వం కాదు.. గడ్డపార సర్కారు
● రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్లు కూల్చేశారు ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
ఖమ్మంఅర్బన్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని.. గడ్డపార సర్కారు అని ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆదివారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కనీస కనికరం లేకుండా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై ఉన్నత న్యాయస్థానం ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. పత్రాలు అసలైనవి కావని కుంటి సాకులు చెబుతూ భారీ యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, రోగులు అని కూడా చూడకుండా ఇళ్ల నుంచి బయటకు లాగారని అన్నారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో తలదాచుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో బీజేపీ పేదలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూల్చే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బాధితులకు అదే ప్రాంతంలో 100 గజాల చొప్పున స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రామచందర్రావు డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇన్చార్జ్ బి.మహిపాల్ రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ, శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, దొడ్డ అరుణ, రజినీ రెడ్డి, కుమళి శ్రీనివాసరావు, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, నీరుకొండ ఉషారాణి, పమ్మి అనిత, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, శ్రీ రామనేని మణి, నకిరేకంటి వీరభద్రం పాల్గొన్నారు.


