● తరలింపులో అటవీ శాఖ ఉద్యోగి హస్తం.? ● స్థానికుల సమాచా
ఫారెస్ట్ వెదురు ప్రైవేటు నర్సరీలకు!
అశ్వారావుపేటరూరల్: అటవీ శాఖ డిపోకు తరలించాల్సిన వెదురు కలపను ఆ శాఖలోని ఓ ఉద్యోగి సహకారంతో పలు ప్రైవేటు నర్సరీలకు తరలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దమ్మపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం బీట్లో ఉన్న ప్లాంటేషన్లో వెదురు బాదులు నరికి డిపోకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం దమ్మపేట ఫారెస్టు డిపోకు తరలించేందుకు లాట్లుగా పేర్చి సిద్ధంగా ఉంచిన వెదురు బాదులను ఓ నర్సరీ యజమాని అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఫారెస్టులోని ఓ కింది స్థాయి ఉద్యోగి సహకారంతో మూడు ట్రాక్టర్లలో తరలించుకుపోయాడు. మండలంలోని నారంవారిగూడెం కాలనీ, అచ్యుతాపురం వద్దగల పామాయిల్ తోటల్లో అక్రమంగా నిల్వ చేశాడు. గుర్తించిన స్థానికులు అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అశ్వారావుపేట, దమ్మపేట ఫారెస్టు రేంజర్లు మురళీకృష్ణ, శ్రీనివాసరావు దాడులు నిర్వహించి వెదురు కలపను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దమ్మపేట ఫారెస్టు రేంజర్ను వివరణ కోరగా.. రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన 12,500 వెదురు బాదులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. లక్షా 50వేల వరకు ఉంటుందని తెలిపారు. విచారణ చేపట్టి, ఉద్యోగుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


