భూసార పరీక్షలతో ప్రయోజనం
అశ్వారావుపేటరూరల్: అన్నదాతలు పంటలు సాగు చేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం జమీమా అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో వ్యవసాయ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామ సమీపంలోని పొలాల్లో మట్టి నమూనాలు సేకరించారు. గ్రామంలోని వీధులు, పరిసరాల్లో ఉన్న కలుపు, పిచ్చి మొక్కల్ని తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటు కోడి గుడ్ల ఇంకుబేటర్ సెంటర్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ సంగం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షలు, కార్డుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ శ్రీజన్, రైతులు పాల్గొన్నారు.


