ఆక్రమణల పేరుతో పేదలకు అన్యాయం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఆక్రమణల కూల్చివేత పేరుతో ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూదాన్ భూముల్లోనే అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయాన పేదలకు ఇళ్ల స్థలాలను ఆశచూపి రూ.50వేలు మొదలు రూ.5లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలన్నారు. కాగా, పేదల నివాసాలను అధికార యంత్రాంగం నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నిస్తే, కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించిందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇక్కడే స్థలాలు కేటాయించాలని, అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని రంగారావు కోరారు. అలాగే, నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబం ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు అగ్రకుల దురహంకారంతో రెండేళ్ల పాప మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు


