 
															కిన్నెరసాని జలాశయానికి వరద
పాల్వంచరూరల్: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,600 క్యూ సెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో శనివారం నీటిమట్టం 406.60 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టుకు చెందిన ఒక గేటు ఎత్తి ఉంచి 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు తెలిపారు.
రేక్ పాయింట్కు 2,518 టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్చార్జ్ పవన్కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు.
గుర్తింపు సంఘం
కృషితోనే బదిలీలు
కొత్తగూడెంఅర్బన్: గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) కృషితో బదిలీలకు మోక్షం కలిగిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ఫర్ పాలసీ మార్చాలని పలుమార్లు కోరగా యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. వ్యక్తిగత, మ్యూచ్వల్, స్పౌస్, హెల్త్ గ్రౌండ్ ప్రాతిపదికన శనివారం 114 మందికి బదిలీ ఉత్తర్వులు ఇప్పించినట్లు తెలిపారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
భద్రాచలంఅర్బన్: పట్టణంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంటీన్, కార్గో, ఆర్టీసీ బస్సుల్లో తరలించే పార్సిళ్లను, ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐలు సతీష్, శ్యామ్ ప్రసాద్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక వాహనాల అడ్డగింత
ట్రాక్టర్ డ్రైవర్లు, గ్రామస్తుల పరస్పర దాడి
టేకులపల్లి: మండలంలోని గంగారం పంచాయతీ సంపత్నగర్ వద్ద ఉన్న పాలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధిక లోడ్తో ట్రాక్టర్లు తిరుగుతుండగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో స్థాని కులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఈ క్రమంలో గ్రామస్తులు శనివారం పాలవాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు , ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణ అనంతరం ఇసుకను వాగులో డంప్ చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు బోడు పోలీసుస్టేషన్కు వెళ్లాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇసుక సొసైటీల ఘర్షణ
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని అనంతారం, చినరాయిగూడెం, కోడిముత్తయ్యగుంపు ఇసుక సొసైటీ సభ్యుల మధ్య శనివారం ఘర్షణ నెలకొంది. మూడు ర్యాంపుల సొసైటీ సభ్యులు ఘర్షణ పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సీఐ నాగబాబు, ఎస్ఐ నగేష్లు వచ్చి సభ్యులకు నచ్చజెప్పి పంపించివేశారు. కాగా ఒక సొసైటీకి సంబంధించిన శివారు దారిలో మరో సొసైటీ వారు ఇసుకను తరలించేందుకు లారీలకు అనువుగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అనంతారం సొసైటీ సభ్యులు రోడ్డు వేయొద్దంటూ అడ్డుకోవడంతో వివాదం తలెత్తినట్లు తెలిసింది.
 
							కిన్నెరసాని జలాశయానికి వరద
 
							కిన్నెరసాని జలాశయానికి వరద

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
