
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవంగా రుద్ర హోమం
నందీశ్వరుడికి అభిషేకం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం రుద్రహోమం, శివాలయంలో నందీశ్వరుడుకి అభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ గావించి రుద్రహోమం, చివరకు పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. హోమంలో పాల్గొన్న వారికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాపారావు, చందుపట్ల రమ్య, చీకటి కార్తీక్ పాల్గొన్నారు.
భద్రాచలం సబ్ కలెక్టర్గా మ్రినాల్ శ్రేష్ఠ
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం సబ్ కలెక్టర్గా మ్రినాల్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన మ్రినాల్ 2023లో విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 449వ ర్యాంక్ సాధించారు.
ఆరేళ్ల తర్వాత ఐఏఎస్ నియామకం..
భద్రాచలం సబ్ కలెక్టర్గా ఆరేళ్ల తర్వాత ఐఏఎస్ అధికారిని నియమించారు. 2018 నుంచి 19 వరకు ఇక్కడ భవేష్ మిశ్రా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఆర్డీఓ స్థాయి అధికారులే. ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయిన మ్రినాల్ శ్రేష్ఠను నియమించారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు తాజాగా బదిలీ అయ్యారు. కాగా, మ్రినాల్ శ్రేష్ఠ గతంలో ఖమ్మంలో ట్రెయినీ కలెక్టర్గా విధులు నిర్వహించారు.
స్వల్పంగా పెరిగిన గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరుతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వస్తుండగా బుధవారం ఉదయం 17 అడుగులు ఉన్న నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ రాత్రికి 19 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.
కేజీబీవీని సందర్శించిన జేడీ
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) సర్వ శిక్షా అభియాన్ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ బుధవారం సందర్శించారు. 8, 9 తరగతుల విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించి, గణితం బోధించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగుతులను పరిశీలించారు. వంటలను పరిశీలించి, మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ హజారి శిరీష, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కేజీబీవీ ఎస్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

కమనీయం.. రామయ్య కల్యాణం

కమనీయం.. రామయ్య కల్యాణం