
మత్తుకు బానిసలు కావొద్దు
భద్రాచలంఅర్బన్: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, హెచ్చరించి వదిలేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు యువకులు గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సామాన్య ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దీంతో అనుమానిత ప్రాంతాలు, గంజాయి హాట్స్పాట్లలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు నిషేధిత పదార్థాలు తరలివెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
క్రీడా పాఠశాలలో
ప్రవేశానికి ఎంపికలు
కొత్తగూడెంటౌన్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న 124 మంది బాలబాలికలకు తొమ్మిది రకాలు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన 10 మంది బాలికలు, 10 మంది బాలురను ఎంపిక చేశారు. వీరిని జూలై 2 నుంచి జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో అర్హత సాధించినవారికి హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని స్పోర్ట్స్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తారని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. ఎస్జీఎఫ్ నుంచి నరేష్, పీడీలు, పీఈటీలు, స్పోర్ట్స్ కార్యాలయం నుంచి తిరుమలరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆఫ్టైప్ మొక్కలపై విచారణ
అశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా అయిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో నష్టపోయినట్లు పలువురు రైతులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ఇటీవల హైదరాబాద్లో అధికారులు, రైతులతో సమావేశమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు అశ్వారావుపేట మండలంలోని పలువురి తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. మండలానికి చెందిన నున్నా కృష్ణ, కుంచం సుబ్బారావు తోటలను పరిశీలించిన వారు ఆఫ్టైప్, సాధారణ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై అధ్యయనం చేశారు. ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ ఏ కిరణ్, జిల్లా ఇన్చార్జ్ రాధాకృష్ణ, అశ్వారావుపేట, దమ్మపేట హెచ్ఓలు వేణుమాధవ్, సందీప్, హెచ్ఆర్ఎస్ సైంటిస్ట్ విజయకృష్ణ, ఆయిల్ఫాం గ్రోయర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు.
డీఐఈఓకు ప్రశంసలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యావిధాన పర్యవేక్షణ, కళాశాలల మెరుగైన నిర్వహణ, ఉత్తీర్ణతా శాతం పెంపునకు కృషి చేసినందుకు డీఐఈఓ హాసవత్ వెంకటేశ్వరరావును ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రశంసించారు. గురువారం హైదరాబాద్లో అన్ని జిల్లాల డీఐఈఓ, ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేసిన కృషిని అభినందించారని వెంకటేశ్వరరావు తెలిపారు.
ముద్దాయిలకు
రెండేళ్ల జైలుశిక్ష
బూర్గంపాడు: బూర్గంపాడులో 2021 ఏప్రిల్ 12న వంగపూడి నాగమణి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు భద్రాచలం ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్ రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. నాగమణి ఇంట్లో రూ 10.లక్షల విలువైన బంగారం, నగదు చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టిన సారపాకకు చెందిన కునమళ్ల సందీప్, బూర్గంపాడుకు చెందిన పుట్టి నవీన్లపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

మత్తుకు బానిసలు కావొద్దు

మత్తుకు బానిసలు కావొద్దు