
ఇసుక లారీలతో ట్రాఫిక్ చిక్కులు
● చర్ల–వెంకటాపురం మార్గంలో రెండు చోట్ల స్తంభించిన రాకపోకలు ● ట్రాఫిక్లో నిలిచిన గర్భిణిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్
చర్ల: ప్రధాన రహదారులపై ఇసుక లారీలు నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా ఇసుక క్వారీల నిర్వాహకులు, అధికారులు పట్టించుకోకపోవడంలేదు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించే వారి పట్ల క్వారీల నిర్వాహకులు దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం చర్ల–వెంకటాపురం మార్గంలో సీ కత్తిగూడెం వద్ద ప్రధాన రహదారిపై రెండువైపులా అధిక సంఖ్యలో ఇసుక లారీలను నిలిపారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండున్నర గంటల పాటు ఈ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోగా ఈ ట్రాఫిక్లో ఓ గర్భిణిని వెంకటాపురం వైపు నుంచి భద్రాచలం వైపు తరలిస్తున్న అంబులెన్సు కూడా ఇరుక్కుపోయింది. చర్ల సీఐ రాజువర్మ, ఎస్ఐ కేశవ్ అక్కడకు చేరుకుని అతికష్టం మీద ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. గురువారం రాత్రి కూడా ఇదే మార్గంలోని సుబ్బంపేటలో ప్రధాన రహదారిపై ఇసుక లారీలు నిలపడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి కూడా పోలీసులు వెళ్లి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రధాన రహదారిపై ఇసుక లారీలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.