
పోడు వివాదంపై ఆర్డీఓ విచారణ
బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని వలస ఆదివాసీ గ్రామమైన కొసగుంపులో ఇటీవల పోడు సాగుదారులైన మహిళలకు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన వివాదంపై భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు గురువారం విచారణ చేపట్టారు. పోడు భూములకు కందకాలు తీసేందుకు జేసీబీతో వచ్చిన అటవీశాఖ అధికారులను కొసగుంపు మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారని అటవీశాఖ అధికారులు, మహిళలని చూడకుండా తమపై దాడులకు పాల్పడ్డారని కొసగుంపు మహిళలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆర్డీఓ దామోదర్రావు గ్రామానికి వచ్చి ఆదివాసీ మహిళలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారుల వాదనలు కూడా విన్నారు. గ్రామంలోని 34 ఆదివాసీ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిప్పించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలిస్తామని ఆర్డీఓ తెలిపారు. మిగతా అటవీభూములలోకి వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, అశ్వాపురం రేంజ్ ఆఫీసర్ రమేష్, ఐటీడీఏ ఏఓ రాంబాబు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భజన సతీష్ తదితరులు పాల్గొన్నారు.