
పరిహారం ఇస్తాం.. ఉపాధి కల్పిస్తాం
మణుగూరు టౌన్: మణుగూరు ఓసీ విస్తరణ నిర్వాసితులకు ఎకరానికి రూ.22.5 లక్షలు నష్టపరిహారం అందిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తెలిపారు. గురువారం పట్టణంలోని కొమ్ముగూడెం కమ్యూనిటీ హాల్లో గ్రామపెద్ద కంగాల భిక్షం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.5.5 లక్షలు, ప్రభుత్వ భూమిలోని గిరిజనులకు పూర్తి పరిహారం, గిరిజనేతరులకు రూ.11.25 లక్షలు అందిస్తామని తెలిపారు. నిర్వాసిత నిరుద్యోగులకు కనీస వేతనం తగ్గకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, ఓసీల్లో ఉపాధి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కోల్పోతున్న భూముల్లో చెట్లు, బోరు, బావి, కట్టడాలు ఉంటే సంబంధిత అధికారుల వాల్యుయేషన్ తెప్పించి అదనంగా ప్రయోజనం చేకూరుస్తామని వివరించారు. చెరువుపై ఆధారపడిన అర్హులైన మత్స్యకారులకు రూ.5.5 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. దీంతో సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
మణుగూరు ఓసీ విస్తరణ గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ