
మాతృమరణాల నివారణకు చర్యలు చేపట్టాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులు అవలంబించాలని, గర్భిణులు ఇళ్లలో మునగ చెట్లు నాటేలా ప్రోత్సహించాలని సూచించారు. మునగలో ఉండే అధిక పోషక విలువలు, వ్యాధుల నివారణకు ఎలా ఉపకరిస్తుందనే విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను కాలానుగుణంగా పర్యవేక్షించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అర్హత కలిగిన సిబ్బందిని మాత్రమే నియమించాలని, ఈ మేరకు తనిఖీలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీఎస్పీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్