
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవా పురం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి సమర్పించిన అర్చకులు మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమమండలి చైర్మన్ బాలినే ని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు.
సీల్డ్ కొటేషన్ల ఆహ్వానం
పెద్దమ్మతల్లి ఆలయంలో దసరా ముందు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వివిధ వస్తువుల సరఫరా, పనుల నిర్వహణకు సీల్ట్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఈఓ రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి రంగులు, సత్రాలతో పాటు అవసరమైన చోట్ల సునం వేసేందుకు కార్మికుల సరఫరా, రుత్విక్ల ఏర్పాటు, వారికి, భక్తులకు వంట చేసేందుకు, సన్నాయి వాయిద్యకారుల ఏర్పాటు, ఆలయం చుట్టూ లైటింగ్, బోర్డుల ఏర్పాటు, పూల అలంకరణ, పూలదండల సరఫరా వంటి పనులు చేసేందుకు ఆసక్తి గలవారు ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలోపు కార్యాలయం బాక్స్లో కోటేషన్లు వేయాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం అందరి సమక్షంలో వాటిని తెరిచి ఖరారు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. వివరాలకు 6303408458 నంబర్లో సంప్రదించాలని కోరారు.
రేపు సబ్ జూనియర్
అఽథ్లెటిక్స్ ఎంపికలు
కొత్తగూడెంటౌన్: జిల్లా స్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు భద్రాచలంలో శనివారం జరుగుతాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 ఏళ్ల బాలబాలికలకు 60 మీటర్ల పరుగు పందెం, స్టాండింగ్, బ్రాడ్ జంప్, లాంగ్జంప్, కిడ్స్, జావెలిన్త్రో తదితర అంశాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని జూలై 6న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 85220 67157 నంబర్లో సంప్రదించాలని కోరారు.
30 లోగా రేషన్ తీసుకోండి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని తెల్ల రేషన్కార్డుదారులు ఈనెల 30 లోగా బియ్యం తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు కలిపి ఒకేసారి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పంపిణీ చేయాలని సూచించారు. ఆయా సమయాల్లో షాపులు తెరవని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 30 తర్వాత రేషన్ కార్డుదారులు బియ్యం పొందేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
వృత్తి విద్యలో రాణించడం అభినందనీయం
పాల్వంచ: వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలు రాణించడం అభినందనీయమని నవ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ దేవినేని, వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు అన్నారు. గురువారం స్థానిక నవ మహిళా సాధికార కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తాటి ఆకుల కళాకృతులు, యూనిఫాంలు కుట్టి విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,59,690 నగదును మహిళలకు చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో పలు రకాల వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి స్థానిక యువత, మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎంజీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.