
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి
కొత్తగూడెంటౌన్: భద్రాద్రిని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని, ఆ మహమ్మారిని తరిమికొట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో అనేక దుష్ఫలితాలు కలుగుతాయన్నారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్న యువత తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతకుముందు డ్రగ్స్ వినియోగించబోమంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, కరమ్చంద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా, కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు, సీఐలు ఎం.కరుణాకర్, శివప్రసాద్, ప్రతాప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మత్తు నుంచి విముక్తికి సైనికుల్లా పోరాడుదాం
గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం
కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పిలుపు