
ఏసీబీ దాడులతో బెంబేలు
● బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు ● అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు
బూర్గంపాడు: జిల్లాలో ఏసీబీ వరుస దాడులు, సోదాలు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో కొందరు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుండగా మరికొందరు తృటిలో తప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇటవల వరుసగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులు వారం, పది రోజుల పాటు జాగ్రత్తగా ఉంటున్నా.. ఆ తర్వాత ‘మామూలు’గానే తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ నెల 21న బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ క్రాంతి కొత్త రేషన్కార్డు ప్రాసెస్ చేసేందుకు రూ. 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన ఐదురోజులకే గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు, కంప్యూటర్ డేటా, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పత్రాలను, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాండ్ కన్వర్షన్ తదితర ఫైళ్లను తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించారు. సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల చాలా ఫిర్యాదులందాయని, ఈ క్రమంలోనే ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని డీఎస్పీ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు చెల్లింపులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు కూడా నిర్థారణకు వచ్చామన్నారు. సోదాలు పూర్తిస్థాయిలో కొనసాగించాక బాధ్యులపై శాఖాపరమైన చర్యల కోసం ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఏ ప్రభుత్వ అధికారైనా, ఉద్యోగైనా లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని కోరారు. ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388981 నంబర్లకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు.