
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
● యంత్రసామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలి ● సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు
మణుగూరు టౌన్: యంత్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, శ్రమశక్తిని ఉపయోగించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు సూచించారు. సింగరేణి మణుగూరు ఏరియాలో గురువారం పర్యటించిన ఆయన పీకేఓసీ గనులు, కోల్ బెంచ్ను పరిశీలించాక యంత్రాల పనితీరుపై ఆరాతీశారు. అలాగే, వ్యూ పాయింట్ నుంచి డ్రిల్ మిషన్లు, షావెల్స్, బొగ్గు లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ వినియోగదారులు కోరిన విధంగా నాణ్యమైన బొగ్గు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. నిర్దేశిత 8 గంటల పనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి ఉద్యోగి, రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడేలా చూడాలని, సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సింగరేణి ఆస్పత్రి సౌకర్యాలు, మణుగూరు ఓసీ భూ సేకరణ అనుమతుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీకేఓసీ పీఓ లక్ష్మీపతిగౌడ్, అధికారులు శ్రీనివాస్, శ్రీనివాసాచారి, చంద్రశేఖర్, వెంకట్రావు, రమేశ్, అనురాధ, వీరభద్రుడు, సురేశ్కుమార్, రమణరెడ్డి, నాగరమేశ్, ఎస్ఓటూ డైరెక్టర్ సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నియామకం, ఉద్యోగులకు 250 గజాల స్థలం కేటాయింపు, గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధుల పెంపు, అన్ని ఓసీల్లో భోజనం సౌకర్యం కల్పించడమే కాక ప్లేడేలలో ఎన్–1, పీహెచ్డీలో పీ2 సర్క్యులర్ రద్దు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై ఐఎన్టీయూసీ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, గట్టయ్య, షాబుద్దీన్ తదితరులు డైరెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అందజేశారు.