
ఫలించిన 18 ఏళ్ల పోరాటం!
● కారుణ్య నియామకం సాధించిన దివ్యాంగుడు ● తొలి ప్రజాదర్బార్లో దరఖాస్తుతో పీఆర్ శాఖలో ఉద్యోగం
అశ్వారావుపేటరూరల్: ఓ దివ్యాంగుడు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఏకంగా 18 ఏళ్ల పాటు పోరాడాడు. ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించగా ఇటీవల నియామకపత్రం అందుకున్నాడు. కొత్తగూడెం విద్యానగర్కాలనీకి చెందిన కర్నాటి నాగేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో గ్యాంగ్ మజ్దూర్గా ఉద్యోగం చేస్తూ 2007లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు దివ్యాంగుడైన రామకృష్ణ కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో 2017లో హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కూడా రామకృష్ణకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ఫలితం కానరాలేదు.
ప్రజాదర్బార్లో వినతితో కదలిక..
న్యాయస్థానంలో పోరాడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి 2023 డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో రామకృష్ణ పాల్గొని మంత్రి సీతక్కకు దరఖాస్తు ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులకు పంపించగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్కుమార్ పరిశీలించి ఈనెల 23వ తేదీన రామకృష్ణను ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డికి ఈ ఉత్తర్వులు అందగా అశ్వారావుపేట పీఆర్ కార్యాలయంలో రామకృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటేషన్పై కొత్తగూడెం పంచాయతీరాజ్ కార్యాలయంలో గురువారం ఆయన విధుల్లో చేరాడు.