
నిబంధనలకు విరుద్ధంగా వైద్యసేవలు
● భద్రాచలం ఏజెన్సీలో ఇష్జారాజ్యంగా క్లినిక్ల నిర్వహణ ● స్థాయికి మించి చికిత్స అందిస్తున్న కొందరు ఆర్ఎంపీలు ● చర్యలు తీసుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు
భద్రాచలంఅర్బన్: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తూ, మోతాదుకు మించి మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రథ మ చికిత్స వరకే పరిమితం కావాల్సిన వారు క్లినిక్లలో పడకలు ఏర్పాటు చేస్తూ, ల్యాబ్లు నిర్వహిస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంలో పలువురు అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, వైద్యఆరోగ్యశాఖ అధి కారులతో సమావేశం నిర్వహించి ఆర్ఎంపీలు పరిధి దాటి చేయకుండా చర్యలు తీసుకోవాలని హె చ్చరించారు. అయినా వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో సుమారు 40 మంది వరకు ఆర్ఎంపీలు ఉన్నారు. ప్రథమ చికిత్స కేంద్రానికి ఎలాంటి పేరు పెట్టకూడదు. అతని పేరు కూడా డాక్టర్గా రాసుకోకూడదు. కట్లు కట్టడం, సైలెన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు వేయడం, వైద్య పరీక్షలకు సిఫారసులు, వంటివి చేయకూడదు. గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లలకు వైద్య అందించొద్దు. కానీ కొందరు ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం పేరుతో రోగుల నుంచి సొమ్ము దండుకుంటున్నారు.
పట్టించుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ
అధికారులు
ఏజెన్సీ ప్రాంతాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు, ఇతర వ్యాధులకు ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క బిల్లుల్లో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు మృతి చెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆర్ఎంపీల క్లినిక్లను తనిఖీలు చేయడంలేదు. కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి వారిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధిక మోతాదులో మందులు ఇస్తూ..
గ్రామాల్లో, బస్తీల్లో జ్వర బాధితులు సాధారణంగా ఆర్ఎంపీల వద్దకే వెళ్తుంటారు. వారు పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ వంటి మందులను ఇస్తూ, త్వరగా నయం చేస్తున్నట్లు నమ్మిస్తున్నారు. దీంతో ప్రజలు వారి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆ మందులు వాడితే అనంతరం కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు వస్తాయనే అవగాహన ప్రజల్లో లేదు. అవగాహన కల్పించే దిశగా అధికారులూ చర్యలు చేపట్టడంలేదు. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా వాడితే జబ్బులు కోరి తెచ్చుకుంటున్నట్లేనని పేర్కొంటున్నారు. బీపీ, స్థూలకాయం, ఎముకల బలహీనత, కంట్లో శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి మించి వైద్యం చేయొద్దు. రోగుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాస్పత్రి లేదా ఎంబీబీఎస్ డాక్టర్కు రెఫర్ చేయాలి. ఆర్ఎంపీలు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ చైతన్య,
డిప్యూటీ డీఎంహెచ్ఓ, భద్రాచలం