
● ఇల్లెందు పట్టణంలో తరచూ తాగునీటి సమస్య ● నీరు సరిపడా,
ఇల్లెందు: వర్షాకాలం మొదలైనా ఇల్లెందు పట్టణ వాసులకు తాగునీటి తిప్పలు తప్పడంలేదు. గత జనవరి నుంచి మూడు, నాలుగు రోజులకోసారి, అదికూడా అరగంటపాటే సరఫరా చేస్తున్నారు. వారం రోజుల క్రితం నాలుగు రోజులపాటు పట్టణంలో నీటి కటకట ఏర్పడింది. పట్టణానికి నీటిని అందించే బాధ్యత మున్సిపాలిటీది కాగా, నీటిని ట్యాంకుల వరకు మిషన్ భగీరథ చేర్చాల్సి ఉంది. ఈ రెండు శాఖల మధ్య తీవ్ర సమన్వయ లోపంతో తరచు నీటి సమస్య ఏర్పడుతోంది. భగీరథ నుంచి సమయపాలన పాటించకుండా, అది కూడా తక్కువ సమయమే నీరు సరఫరా చేస్తున్నారని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు సకాలంలో ట్యాంకులకు ఎక్కించుకుని ట్యాప్లకు సరఫరా చేయకపోవటం లేదని మిషన్ భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. రెండు శాఖల అధికారులను సమన్వయం చేసే అధికారి, ప్రజాప్రతినిధి లేకపోవటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. మున్సిపల్ పాలకవర్గం కూడా లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.
మూడు, నాలుగు రోజులకోసారి..
ఇల్లెందు పట్టణంలో 24 వార్డులు ఉండగా, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ పరిధిలోని చెరువు, సింగరేణి నీరు సరఫరా చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మున్సిపాలిటీ వాటర్ సప్లైలో మోటార్లు మొరాయించటంతో నీటిరు సరఫరాలో లోపం తలెత్తింది. తోగ్గూడెంలోని మిషన్ భగీరథ ఫిల్టర్బెడ్లో మరమ్మతుల కారణంగా సక్రమంగా నీరు అందడంలేదు. దీంతో నాలుగు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది.
అసంపూర్తిగా భగీరథ పనులు
ఇల్లెందులో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం నుంచి మొదలుకుని పైపులైన్లు, నల్లాలు అన్ని అసంపూర్తిగానే వదిలేశారు. మెయిన్ లైన్, సబ్లైన్లు, ఇంటింటికీ నల్లాలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కొన్ని వీధుల్లో పైపులైన్లు లీకవుతున్నాయి. పట్టణంలో ఐదు వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉండగా, వీటన్నింటికీ భగీరథ పైపులైన్ల అనుసంధానం చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది.
●