
‘శానిటరీ కాంప్లెక్స్’ పూర్తి చేయాలి
పాల్వంచరూరల్: పక్షం రోజుల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ఏడాది రూ.3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఆలయ ఈఓ పర్యవేక్షణలో పనులు కొనసాగుతుండగా, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎస్బీఎం కన్సల్టెంట్ రేవతి పాల్గొన్నారు.
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్లో బుధవారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ట్రాలీ ఆటో కింద పడి మృతి చెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం శిల్పినగర్లోని ఓ దుకాణం వద్ద తెప్పల మనోజ్(18)కు, నాగేంద్రకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, నాగేంద్ర తాను పని చేస్తున్న కంపెనీ ట్రాలీ ఆటోలో ఎక్కుతుండగా, నాగేంద్రను కిందకు లాగే ప్రయత్నంలో మనోజ్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో ట్రాలీ ఆటో వెనుక టైరు మనోజ్ తల మీదుగా పోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి కల్యాణ్ ఫిర్యాదు మేరకు నాగేంద్రతోపాటు ట్రాలీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు భద్రాచలం పోలీసులు తెలిపారు.
ఇద్దరు వైదిక సిబ్బందికి షోకాజ్ నోటీసులు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైదిక సిబ్బందికి దేవాదాయ శాఖ అధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరి గిన గ్రూప్ చర్చల్లో దేవస్థానంలో భక్తులు అర్చకులకు సమర్పించే కానుకలు తమకే చెందుతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఈ విషయం ఆలయ అధికారులకు తెలి యడంతో పూర్తి వివరణతో కూడిన నివేదికను రెండు రోజుల్లో అందించాలని షోకాజ్ నోటీసులు అందజేశారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెట్రోల్బంక్ నిర్వహణపై విచారణ
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ నిర్వహణపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో డీసీఎస్ఓ రుక్మిణి బుధవారం విచారణ చేపట్టారు. వినియోగదారుల వాంగ్మూలం రికార్డు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. నిర్వహణ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలని బంక్ నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఎస్వో వరదరాజులు, సివిల్ సప్లాయీస్ డీటీ రాజు, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.