
ఆగస్టు 15 నాటికి దరఖాస్తుల పరిష్కారం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా 58,365 దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 వరకు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వన మహోత్సవంలో 70 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఏఓ బాబూ రావు, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, జిల్లా ఉద్యాన శాఖాధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతిపై వీసీలో కలెక్టర్ పాటిల్