బూడిద.. చెరువుల పాలు.. | - | Sakshi
Sakshi News home page

బూడిద.. చెరువుల పాలు..

Jun 25 2025 6:43 AM | Updated on Jun 25 2025 6:43 AM

బూడిద.. చెరువుల పాలు..

బూడిద.. చెరువుల పాలు..

● యాష్‌ రేటు పెంచడంతో తగ్గిన కొనుగోళ్లు ● విధిలేక బూడిదను చెరువులకు వదులుతున్న అధికారులు ● అవి నిండుతుండడంతో కట్టల ఎత్తు పెంచుతున్న వైనం..

పినపాక: పినపాక – మణుగూరు మండల సరిహద్దులోని భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న బూడిద రేట్లను పెంచడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆ బూడిదను చెరువుల్లోకి తరలిస్తున్నారు. ఫలితంగా ఐదు నుంచి 10 అడుగుల వరకు ఉండాల్సిన బూడిద చెరువులను 30నుంచి 40అడుగుల ఎత్తువరకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదికూడా నిండితే అధికారులు ఏం చేస్తారోనని పరిసర ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ బూడిదను ఇటు కల బట్టీలు, సిమెంట్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్లలో వినియోగిస్తారు.

పెరుగుతున్న ధరలు

అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి బూడిద రేట్లను భారీగా పెంచుతున్నారు. పాల్వంచ కేటీపీఎస్‌లో టన్ను ధర రూ.30 నుంచి రూ.60 ఉండగా, టీబీపీఎస్‌లో రూ.150 నుంచి 200వరకు విక్రయిస్తున్నా రు. ఇది కాక లోడింగ్‌ చార్జీలు, కాటా చార్జీల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తద్వారా విక్రయాలు తగ్గి బూడిదను చెరువులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నిండిన చెరువులు

పవర్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే బూడిద ఎక్కువ శాతం బంకర్ల ద్వారా ఇటుకల బట్టీలకు, సిమెంట్‌ కంపెనీలకు విక్రయించి, కొంత శాతం బూడిదను వాటర్‌ ద్వారా బూడిద చెరువుకు తరలిస్తారు. కానీ పవర్‌ ప్లాంట్‌లో దానికి భిన్న పరిస్థితి ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి అధిక రేట్లకు టెండర్లు వేసి బూడిద విక్రయిస్తున్నారు. రేట్లు అధికంగా ఉండడంతో సిమెంట్‌ కంపెనీలు, ఇటుకల బట్టీల యజమానులు మరోచోట బూడిదను కొనుగోలు చేస్తుండటంతో.. మిగులుతున్న బూడిదను గొట్టాల ద్వారా చెరువులకు తరలిస్తున్నారు. తద్వారా బూడిద చెరువులు నిండుతున్నాయి. ఇలా ఐదునుంచి పదిఅడుగులు ఉండాల్సిన బూడిదచెరువులు బూడిదతో నిండటం, వేరే ఒకమార్గం లేక సుమారు 30 నుంచి 40 అడుగులఎత్తుకు చెరువులను పెంచుతున్నారు. అది నిడితే అధికారులు ఏంచేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఉచితంగా ఇవ్వాలి

పవర్‌ ప్లాంట్‌ నిర్వాసిత గ్రామాల్లో ఉంటున్న ప్రజలకు, ఇటుకల బట్టీలకు, అవసరమైన వారికి ఉచితంగా బూడిద అందజేయాలి. అధిక రేట్లకు కొనలేని పరిస్థితి ఉంది. అధికారులు బూడిదను కూడా విక్రయిస్తుండడం సరికాదు. ఈ అంశంపై ఇప్పటికై నా పునరాలోచించాలి.

–సుబ్బారెడ్డి, ఇటుకల బట్టీ యజమాని, ఐలాపురం

ధరలు తగ్గించాలి

బీటీపీఎస్‌లో బూడిద ధరలను తగ్గించాలి. నామమాత్రపు ధరలకు బూడిదను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్నుకు రూ.180 నుంచి రూ.200 పెట్టుకుని బూడిద కొంటే ఇటుకలు అధిక రేట్లకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారుల తగు చర్యలు తీసుకోవాలి.

–రవి, బట్టుపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement