మావోయిస్టులకు సహకరించొద్దు.. | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సహకరించొద్దు..

Jun 25 2025 6:43 AM | Updated on Jun 25 2025 12:38 PM

పాల్వంచరూరల్‌: సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులకు ఆదివాసీ గిరిజనులు సహకరించవద్దని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌) జి.నరేందర్‌ సూచించారు. మండలంలోని మల్లారం జీపీ మామిడికుంట గ్రామాన్ని మంగళవారం సీఐ సతీశ్‌కుమార్‌తో కలిసి అడిషనల్‌ ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో మాట్లాడారు. పిల్లలకు స్టడీ మెటీరియల్‌, పుస్తకాలు పంపిణీ చేశారు. వలస ఆదివాసీలకు పోలీసుల సహకారం ఎప్పుడూ ఉంటుందని, మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని చెప్పారు. కార్యక్రమంలో రూరల్‌ ఎస్‌ఐ సురేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్దీపనం పుస్తకాల సరఫరాకు టెండర్లు

భద్రాచలంటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గిరిజన ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉద్దీపకం వర్క్‌ బుక్‌–2 ఇవ్వనుండగా, ముద్రించి సరఫరా చేసేందుకుటెండర్లు ఆహ్వా నిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ తెలిపారు. సుమారు 13,206 మంది విద్యార్థులకు అన్నిపుస్తకాలు కలిపి 30,89,784 పేజీ ల మేర ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లా లోని ప్రింటింగ్‌ప్రెస్‌ల యజమానులు నిర్ణీత రుసుం డీడీ రూపంలో చెల్లించి ఐటీడీఏ కార్యాలయంలో టెండర్‌ దరఖాస్తులు తీసుకుని ఈ నెల 28వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. వివరాలకు ఐటీడీఏ ఉపసంచాలకుల కార్యాలయంలో 97013 15526, 91828 61609 నంబర్ల ద్వారా సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.

కేవీకే కోఆర్డినేటర్‌  రవికుమార్‌ బదిలీ
వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌గా నియామకం 

వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞా న కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రవికుమార్‌ బదిలీ అయ్యారు. ఆయన ను భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌గా నియమించారు. అయితే, రవికుమార్‌ స్థానంలో కేవీకే కోఆర్డినేటర్‌గా ఎవరి నీ నియమించలేదు. కేవీకేలో సీనియర్‌ శాస్త్రవేత్తకు కోఆర్డినేటర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

జిల్లా అథ్లెట్‌కు అభినందన

కొత్తగూడెంటౌన్‌: కరకగూడెంనకు చెందిన అథ్లెట్‌ తోలెం శ్రీతేజకు బంగారు పతకం రావ డం హర్షణీయమని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.మహీధర్‌ మంగళవారం తెలిపారు. యూపీలోని ప్రయోగరాజ్‌లో జరుగుతున్న జాతీయ జూనియర్‌ (అండర్‌–20) ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోలెం శ్రీతేజ.. ఈవెంట్లో బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. శ్రీతేజ, కోచ్‌ నాగేందర్‌బాబును యువజన క్రీడలశాఖ అధికారి ఎ. పరందామరెడ్డి, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.సారంగపాణి, కోచ్‌ నాగపూరి రమేశ్‌ తదితరులు అభినందించారని ఆయన పేర్కొన్నారు.

వైన్స్‌ వద్ద ఘర్షణ.. కత్తిపోట్లు

ఖమ్మంఅర్బన్‌: వైన్స్‌ వద్ద మందుబాబుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఖమ్మం విజయ డెయిరీ ఎదురుగా వైన్స్‌ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఇందిరానగర్‌కు చెందిన మనీశ్‌ వైన్స్‌ వద్ద మద్యం సేవిస్తూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో టేకులపల్లి లక్ష్మీనగర్‌కు చెందిన తాపీ మేసీ్త్ర మేడరాజుల వెంకటేశ్వర్లు ఇదేమిటని ప్రశ్నించగా వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. ఈక్రమంలోనే మనీష్‌కు ఆయన స్నేహితులు తోడై వెంకటేశ్వర్లుపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మనీష్‌పై దాడి చేయగా ఆయన మెడపై తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వెంకటేశ్వర్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించగా, ఈ గొడవతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.

మావోయిస్టులకు సహకరించొద్దు..1
1/1

మావోయిస్టులకు సహకరించొద్దు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement