
ఆశల మొలకలు
పంట చేలల్లో
రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా తేలికపాటి వానలు
● పత్తి పంట, వరినారుకు జీవం పోసిన వర్షపు జల్లులు ● విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు రైతు ‘భరోసా’ ● మరింత ముమ్మరం కానున్న సాగు పనులు
బూర్గంపాడు: మృగశిర కార్తెలో ముఖం చాటేసిన వరుణుడు ఆరుద్రలో కరుణించాడు. ఈ నెల 22న ఆదివారం నుంచి ఆరుద్ర కార్తె ఆరంభంకాగా, తొలిరోజు నుంచే జిల్లాలో వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయని సామెత. సోమవారం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వానలు కురిశాయి. దీంతో పత్తి మొక్కలు, వరినార్లు జీవం పోసుకున్నాయి. పది, పదిహేను రోజుల క్రితం నాటిన విత్తనాలు కూడా మొలకెత్తుతున్నాయి. వరినార్లకు మొలకలు వస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు.
పొడి దుక్కుల్లోనే విత్తనాలు
ఈ ఏడాది మేలో అకాల వర్షాలు కురవటంతో భూములు పదునయ్యాయి. దీంతో రైతులు అప్పుడే దుక్కులు చేసుకుని పంటల సాగుకు భూములు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలోనే చాలామంది పొడి దుక్కుల్లో పత్తి గింజలు వేశారు. 5న కురిసిన ఓ మోస్తరు వర్షానికి అక్కడక్కడా పత్తి గింజలు మొలకలు వచ్చాయి. ఆ తర్వాత 15 రోజులపాటు చినుకు పడలేదు. దీనికి తోడు ఎండల తీవ్రత పెరగడంతో పత్తి మొక్కలు వడలిపోయాయి. కొన్నిచోట్ల మొక్కలను కాపాడుకునేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోశారు. మరికొన్నిచోట్ల మొలకలు రాకపోవటంతో రెండోసారి పత్తి గింజలు విత్తారు. ఈ నెల రెండో వారంలో పోసిన వరినార్లు కొంత మొలకలు వచ్చి, కొంత మొలకలు రాలేదు. ఈ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. వాన కోసం రైతులు మూడు వారాలుగా ఎదురుచూస్తున్నారు. శనివారం రాత్రి నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జిల్లావ్యాప్తంగా జల్లులు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి జిల్లాలో చిరు జల్లులు పడుతుండటం పంటలకు జీవం పోసింది. వర్షాలు ఆలస్యం కావటంతో ఈ ఏడాది పంటల సాగు రెండువారాలు ఆలస్యమైంది.
2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో ఈ ఏడాది 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా. ఇప్పటికే 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. మిగిలిన రైతులు ఈ వారంలో విత్తనాలు వేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర పెంచటం, మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ఈ ఏడాది జిల్లాలో పత్తిసాగు గణనీయంగా పెరగనుంది. ఇక ఖరీఫ్లో 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు వరినార్లు పోసుకున్నారు. కొన్నిచోట్ల వరి నార్లు మొలకలు వచ్చాయి. మోటార్ల కింద రైతులు వరినార్లుకు నీరు పెట్టి నారు పెంచుతున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే వరి నాట్లు షురువవుతాయి. బోర్లు కింద జూలై మొదటివారం నుంచి వరినాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిర్చికి రేటు పడిపోవటంతో రైతులు విముఖత చూపుతుండటంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు పడిపోనుంది.
అందిన భరోసా.. సాగుకు ఊతం
రైతులు పెట్టుబడులకు వెతుకులాడుకోకుండా రైతు భరోసా అందించటం కూడా పంటల సాగుకు ఊతమిచ్చినట్లయింది. జిల్లాలోని రైతులందరికీ దాదాపుగా రైతు భరోసా పెట్టుబడి సాయం అందింది. దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఎరువుల కొరత ఉంటుందనే ప్రచారంతో చాలామంది రైతులు రైతు భరోసా నగదుతో ముందస్తుగానే యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.

ఆశల మొలకలు

ఆశల మొలకలు