
అరకొర వసతులే!
● స్థాపించి నాలుగేళ్లయినా అసంపూర్తిగా భవనాల నిర్మాణం ● వెంటాడుతున్న అధ్యాపకులు, సిబ్బంది కొరత ● ఇదీ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితి ● ఈ నెల 25 నుంచి కళాశాలలో ప్రత్యేక కమిటీల తనిఖీ
మెడికల్ కళాశాలలో సిబ్బంది వివరాలు..
పోస్టులు ఉండాల్సింది ఉన్నది
రెగ్యులర్ కాంట్రాక్ట్
ప్రొఫెసర్ 41 10 01
అసోసియేట్ ప్రొఫెసర్ 51 05 ––
అసిస్టెంట్ ప్రొఫెసర్ 139 32 08
ట్యూటర్లు 31 –– 13
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ 76 18 ––
అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 01 –– ––
సీనియర్ అసిస్టెంట్ 01 –– –
టెక్నీషియన్లు 24 –– ––
ఔట్ సోర్సింగ్ సిబ్బంది 75
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విరివిగా మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. వైద్యకళాశాలకు అనుమతులు సాధించడంలో చూపించిన శ్రద్ధ కాలేజీ భవనాల నిర్మాణం, సిబ్బందిని భర్తీ చేయడంలో చూపించడంలేదు. దీంతో కొద్దిమంది అధ్యాపకులతో అద్దె భవనాల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ దుస్థితిపై ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త మెడికల్ కాలేజీల పరిస్థితులపై అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది ప్రత్యేక కమిటీలను నియమించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు కమిటీ సభ్యులు కళాశాలలను సందర్శించి, పరిశీలించి 30న ప్రభుత్వానికి నివేదిక అందివ్వనున్నారు.
నాలుగో బ్యాచ్ వచ్చేస్తోంది
జిల్లాకు 2021లో 150 సీట్లతో వైద్యకళాశాల మంజూరైంది. మొదటి బ్యాచ్ విద్యార్థులు 2022 నవంబరులో చేరారు. ఈ ఏడాది కౌన్సెలింగ్ పూర్తయితే నాలుగో బ్యాచ్ విద్యార్థులు కూడా చేరతారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు ఫైనలియర్కు చేరుకుని జూనియర్ డాక్టర్ హోదా పొందుతారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి మెడికోలు సుమారుగా 600 మంది, టీచింగ్ స్టాఫ్ రెండు వందల మంది, సపోర్టింగ్ స్టాఫ్తో కలుపుకుని దాదాపుగా వెయ్యి మందికి అనువుగా మెడికల్ కాలేజీకి భవనాలు, హాస్టళ్లు, ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, ఆఫీస్ స్టాఫ్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు సమకూరాల్సి ఉంది.
సమస్యల చిట్టా
ప్రస్తుతం కాలేజీ భవనాలు, బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు, మెస్, రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని వేర్వేరు చోట్ల గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్ మెస్లో పెట్టే భోజనం నాణ్యతగా లేదంటూ గతేడాది వివాదం చోటు చేసుకుంది. హాస్టల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో మెడికోలు గాయపడ్డారు. ‘భద్రాద్రి కొత్తగూడెం’ తరహాలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేకపోవడం, భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్ఎంసీ ఎఫెక్ట్... మొదలైన పనులు
మెడికల్ కాలేజీకి హాస్టల్, తరగతి గదులు, మెస్, రెడిసెండ్ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాల నిర్మాణం జరుగుతోంది. అకడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ 4, బాల, బాలికల హాస్టళ్లు జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్, స్టాఫ్ క్వార్టర్స్ జీ ప్లస్ 2 గా నిర్మించాల్సి ఉంది. 2023 ఆరంభంలో పనులు మొదలవగా 2024 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకోగా నిధుల సమస్య తలెత్తడంతో గత మార్చిలో పనులు ఆపేశారు. ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు మళ్లీ మొదలు పెట్టారు. భవన నిర్మాణ కార్మికులు, యంత్రాలు తిరిగి కాలేజీ దగ్గరకు చేరుకుంటున్నాయి.