
నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో వీకే–7ఓసీ గనికి అన్ని రకాల అనుమతులు లభించిన నేపథ్యంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ఈ ఏడాది కంపెనీ నిర్దేశించిన 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీ, రైల్వే సైడింగ్ పనులపై సమీక్షించారు. ఓసీకి కేటాయించిన స్థలాన్ని, నూతన సీహెచ్పీని పర్యవేక్షించారు. అనంతరం ఏరియా అధికారులతో మాట్లాడుతూ రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ, బ్లాస్టింగ్, లోడింగ్ పనుల వివరాలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచేలా చూడాలని సూచించారు. తొలుత ఏరియా జీఎం శాలెంరాజు తదితరులు డైరెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం రామకృష్ణ, జీకే ఓసీ పీఓ శ్రీ.రమేష్, తావురియా తదితరులు పాల్గొన్నారు.
రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రైతు భరోసా రూ.9 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వం సచివాలయం వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వీడియో సౌకర్యం ఉన్న 58 రైతు వేదికల్లో రైతులు సదస్సును వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా రైతులు కూడా హాజరయ్యేలా చూడాలని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హాజరైన రైతుల వివరాలు నమోదు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.