
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
పరుగును ప్రారంభించిన
కలెక్టర్ జితేష్, ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెంటౌన్: అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాజ్యోతితో పరుగులు పెట్టారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొత్తగూడెం సూపర్బజార్ వద్ద రన్ ప్రారంభించి బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ మీదుగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జిల్లా కేంద్రంలో 50 ఎకరాల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే యువతను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, క్రీడా సంఘాల బాధ్యులు సాబిర్పాషా, నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, కె.మహీధర్, యుగంధర్రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, డాక్టర్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.