
అంతా పకడ్బందీగా..
● అంగన్వాడీ సరుకులు పక్కదారి పట్టకుండా ఏర్పాట్లు ● సెంటర్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ ● మొదటగా చిన్నారుల తల్లులకే.. ● వచ్చే నెల 1 నుంచి అమలు
భద్రాచలంఅర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తల్లుల ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయాలని భావిస్తోంది. ఆరు నెలలుగా మూడేళ్ల చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్రమే దీనిని వినియోగిస్తోంది. ఇందుకు ఫోన్ ట్రాకర్ యాప్లో తల్లుల ముఖ గుర్తింపు నమోదు చేస్తోంది. ప్రస్తుతం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జులై 1 నుంచి పకడ్బందీగా..
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,654 మంది, 3 – 6 ఏళ్ల మధ్య వారు 26,635 మంది ఉన్నారు. వీరితో పాటు 6,429 మంది గర్భిణులు, 5,825 మంది బాలింతలు ఉన్నారు. ప్రస్తుతం 192 టీచర్, 961 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ నమోదు తప్పనిసరి చేసింది. సరుకులు పక్కదారి పట్టకుండా ఈ ప్రక్రియ అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలోని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే ఈ ప్రక్రి య కొనసాగుతుండగా.. కొందరికి ఫోన్ ట్రాకర్ పనిచేయక పోగా.. దీన్ని వచ్చే నెల నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. యాప్ను సైతం అప్డేట్ చేశారు.
ఇప్పటివరకు చిన్నారులకే..
ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ఆరు మాసాల వారి నుంచి మూడేళ్ల చిన్నారులకు పంపిణీ చేసే అదనపు ఆహారమైన బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్ర మే ఇప్పటివరకు వర్తించేది. మూడేళ్లలోపు చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని రిజిస్ట్రేషన్ అయి న తల్లి లేదా తండ్రి ఫొటోను ఫోన్లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. ప్రస్తుతానికి నమోదు ఇదొక్కటే అయినప్పటికీ రానురాను అన్ని సరుకులను ఫేషి యల్ రికగ్నైజేషన్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఈ విధానం ద్వారానే అందించనున్నారు.
అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం
ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యేలా చూస్తాం. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు అందించే సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా నమోదు చేస్తున్నాం. జూలై 1 నుంచి బాలింతలు, గర్భిణులకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ తర్వాతనే పోషకాహారం అందిస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు దీనిని పూర్తిస్థాయిలో అమలులోకి తెస్తాం.
–జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించే అన్ని రకాల సరుకులు, పోషకాహారం పంపిణీ చేసే సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయడంతో చిన్నారుల తల్లులు, ఇటు బాలింతలు, గర్భిణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన అన్ని సరుకులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా చేరుతాయని పేర్కొంటున్నారు.

అంతా పకడ్బందీగా..