ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Jun 24 2025 3:41 AM | Updated on Jun 24 2025 3:41 AM

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

వైభవంగా రుద్రహోమం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం అమ్మవారికి రుద్రహోమం పూజలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని యాగశాలలో రుద్రహోమం పూజలు చేశారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజలు, రుద్రహోమం గావించారు. చివరన పూర్హాహుతి జరిపారు. రుద్రహోమం పూజలో పాల్గొన్న ముగ్గురు దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్‌ చెవుగాని పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానికి వేయి

సంతకాలతో వినతి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధా నమంత్రి మోదీకి వేయి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు ఈజీఆర్‌ వెస్లీ, ఆర్‌.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, టీజీఈ జేఏసీ కన్వీనర్‌ ఎస్‌.వెంకటపుల్లయ్య, చైర్మన్‌ రామారావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడు మృతి

ఇల్లెందురూరల్‌: మండలంలోని కొమ్ముగూడెం జీపీ నాయకులగూడెం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్తీ ఉదయ్‌ (21) మృతి చెందాడు. మాణిక్యారం గ్రామానికి చెందిన ఉదయ్‌, అతని స్నేహితులు ప్రభాస్‌, వినీత్‌రాజ్‌ ముగ్గురు బైక్‌పై ఇల్లెందు నుంచి మాణిక్యారం వెళ్తుండగా నాయకులగూడెం స్టేజీ వద్ద గేదెను ఢీకొట్టారు. డ్రైవింగ్‌ చేస్తున్న ఉదయ్‌ తీవ్రంగా గాయపడగా, అతని స్నేహితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గేదె అక్కడికక్కడే మృతి చెందింది. 108 ద్వారా క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వాస్సత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయ్‌ మృతి చెందాడు. సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement