
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి..
సూపర్బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు మిషన్ పరివర్తన, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు చేపట్టామని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిస కావొ ద్దని, ఆరోగ్యాన్నే కాకుండా సామర్థ్యాన్ని కూడా నశింపజేస్తాయన్నారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు. డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ దక్షిణ ఫౌండేషన్ ద్వారా భద్రాచలంలో ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో హాట్స్పాట్ సెంటర్లను గుర్తించి అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, ఎక్సైజ్ శాఖలదే కాకుండా ప్రతి పౌరుడిపై ఉందన్నారు. డ్రగ్స్కు బానిసలైన వారి వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 14446కు ఫోన్ చేసి చెబితే తగిన సలహాలు, సూచనలు ఇస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం – ఆరోగ్యంపై ప్రభావం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఆర్డీఓలు మధు, దామోదర్రావు, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఐఈఓ వెంకటేశ్వర్లుతోపాటు అనసూయ, ఇందిర, సంజీవరావు, కరంచంద్, వరప్రసాద్, నరేశ్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్లు వేణుగోపాల్,
విద్యాచందన