
‘ప్లాంటేషన్’ భూముల ఆక్రమణకు యత్నం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని రామన్నగూడెంలోని సర్వే నంబర్లు 30, 36, 39లో ఉన్న భూములను తమకు అప్పగించాలనే డిమాండ్తో సోమవారం స్థానిక గిరిజనులు అటవీ, ఎఫ్డీసీ ఆధీనంలో ఉన్న ప్లాంటేషన్ భూముల ఆక్రమణకు యత్నించారు. గిరిజనులంతా భూముల్లోకి చేరి నాలుగు గంటలపాటు బైఠాయించారు. ఆయా సర్వేనంబర్లలో ఉన్న సుమారు 573ఎకరాల భూ ములు తమ పూర్వీకుల నుంచి పూర్వపు హక్కు పట్టాలు కలిగి ఉన్నామని, హైకోర్టుతోపాటు నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ సర్వే చేసి గిరిజనులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. తాము అనేక దఫాలుగా భూములను అప్పగించాలని పోరాటాలు చేస్తున్నామని, ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామని, దీంతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి విస్మరించారని వివరించారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ డీఎం గణేశ్, ఎఫ్డీసీ రేంజర్ చంద్రకళతోపాటు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి గిరిజనులతో చర్చించారు. తహసీల్దార్ రామకృష్ణకు సమాచారం అందించగా.. ప్రస్తుతం కలెక్టర్ అందుబాటులో లేరని మరో రెండు రోజుల గడువు కోరారు. చివరికి అధికారుల వినతితో గిరిజనులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.