
డ(ద)యాలసిస్ సేవలు..!
● గుండాలలో డయాలసిస్ కేంద్రానికి ప్రతిపాదనలు ● 20 రోజుల్లో ఏర్పాటు చేసేలా సన్నాహాలు ● పరిశీలన చేసిన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టీం ● జిల్లాలో 7 సెంటర్లు.. 53 డయాలసిస్ మిషన్లు
ఇల్లెందు: జిల్లాలో మారుమూల మండలమైన గుండాల మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనతో డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.రవిబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన గుండాల పీహెచ్సీలో 20 రోజుల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కానుంది.
పీహెచ్సీ పరిశీలన..
గత మేలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్కు లేఖ రాయగా.. ఆయన సూచనతో డీసీహెచ్ఎస్ ఐదు పడకల డయాలసిస్ కేంద్రం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టీం సభ్యులు గుండాల పీహెచ్సీని సందర్శించి అక్కడున్న సదుపాయాలను పరిశీలించారు. ఈక్రమంలో 21న గుండాల మండలానికి వచ్చిన మంత్రి పొంగులేటి దృష్టికి మండల ప్రజలు సమస్యను తీసుకెళ్లడంతో.. ఇప్పటికే ఐదు పడకలతో ప్రతిపాదనలు ఉండగా.. మంత్రి నుంచి ఆదేశాలు రావడంతో మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
త్వరలో అందుబాటులోకి..
గుండాల మండలంలో సుమారు 30 వేల జనాభా కలిగి ఉంది. గుండాల–ఇల్లెందు, గుండాల– మణుగూరు, గుండాల– ములుగు, గుండాల–నర్సంపేటలు ఒకదానికొకటి కనీసం 70కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాగా, గుండాల మండలంలో 75 మంది వరకు డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీరంతా డయాలసిస్ కోసం సమీప పట్టణానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండగా.. గుర్తించిన ఎమ్మెల్యే కలెక్టర్తో చర్చించి డీసీహెచ్ఎస్ ద్వారా ఆరోగ్యశ్రీ మెల్త్ కేర్, వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తెచ్చారు. ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు అన్ని అంశాలు సానుకూలంగా మారాయి.
జిల్లా పురోభివృద్ధికి దోహదం..
జిల్లాలో ఏడు కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గుండాల వంటి మారుమూల ప్రాంతం నుంచి డయాలసిస్ కోసం వెళ్లాలంటే ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రులు, చర్ల, పాల్వంచ సీహెచ్సీలు, కొత్తగూడెం జీజీహెచ్లలో డయాలసిస్ సెంటర్లు దిగ్విజయంగా సాగుతున్నాయి.
జిల్లాలో డయాలసిస్ సెంటర్లు, యంత్రాల వివరాలు..
సెంటర్ డయాలసిస్ రోగులు
యంత్రాలు
ఏరియా ఆస్పత్రి 08 32
ఇల్లెందు
సీహెచ్సీ పాల్వంచ 10 41
ఏరియా ఆస్పత్రి 10 60
భద్రాచలం
ఏరియా ఆస్పత్రి 05 32
మణుగూరు
సీహెచ్సీ చర్ల 05 10
ఏరియా ఆస్పత్రి 05 29
అశ్వారావుపేట
జీజీహెచ్ కొత్తగూడెం 10 44
మొత్తం 53 248
ప్రతిపాదనలు పంపాం..
గుండాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ఆరోగ్య హెల్త్కేర్ యూనిట్ టీం సభ్యులు కూడా పరిశీలించారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో 20 రోజుల్లో ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ దృష్టికి తీసుకెళ్తాం.
– డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్

డ(ద)యాలసిస్ సేవలు..!