పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Jun 23 2025 5:46 AM | Updated on Jun 23 2025 5:46 AM

పురుగ

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

జూలూరుపాడు:పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాదావత్‌ రవి తెలిపిన వివరాల ప్రకారం.. పాపకొల్లు రెవెన్యూ పరిధి వెనకతండాకు చెందిన కళావతి(32)కి, జూలూరుపాడుకు చెందిన షేక్‌ అన్వర్‌ను ప్రేమ వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో అన్వర్‌ తన భార్యను కులం పేరుతో దూషిస్తూ, అనుమానంతో చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా ఓపికతో ఉంటునా భర్తలో మార్పు రాకపోగా ఈనెల 19న భార్యను అక్రమ సంబంధంపై అనుమానించి, పురుగు మందుల డబ్బా ఇచ్చి ఇంటి తలుపులు మూసివేసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి అన్వర్‌ తల్లి తలుపులు తీసి చూడగా.. కళావతి అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో (తల్లాడ వద్ద) మృతి చెందింది. మృతురాలి తండ్రి ధరావత్‌ సామ్యా అన్వర్‌ పెట్టే చిత్రహింసల వల్లే మృతిచెందిందని ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

అత్త ఇంటి ఎదుట కోడలు నిరసన

మణుగూరుటౌన్‌: మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఓ వివాహిత తన కొడుకుతో సహా అత్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను బాధితురాలు ఇలా తెలిపింది. మున్సిపాలిటీకి చెందిన బూర రవితేజకు కొన్నాళ్ల క్రితం పగిడేరుకు చెందిన శ్రావణికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. శ్రావణి పుట్టింటికి వెళ్లిపోగా.. పిల్లల్లో ఒకరు తల్లి దగ్గర, మరొకరు తండ్రి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్త మరో కొడుకును తన నుంచి దూరం చేస్తున్నాడని, మానసికంగా వేధిస్తూ విడాకులు ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వివాహిత ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని తన కొడుకును తనకివ్వాలని కోరుతూ.. శనివారం అర్ధరాత్రి గాంధీబొమ్మ సెంటర్‌లోని అత్త ఇంటి వద్ద నిరసనకు దిగింది. దీంతో ఆమె అత్త, భర్త ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.

హత్య కేసు నమోదు

దుమ్ముగూడెం: భూ సరిహద్దు తగాదాల వల్ల ఓ వ్యక్తి మృతిచెందాడు. సీఐ అశోక్‌ కథనం ప్రకారం.. మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన సవలం మల్లేష్‌, సవలం నాగేశ్వరరావుల మధ్య గత కొంతకాలంగా భూమి సరిహద్దు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి మల్లేష్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలు కావడంతో.. భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, వీరిద్దరూ సొంత అన్నదమ్ముల పిల్లలు. హంతకుడు నాగేశ్వరరావు పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపర్చుతామని పేర్కొన్నారు.

నగదు చోరీ..

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం శ్రీసీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వరంగల్‌ జిల్లా తొర్రూరు నుంచి ఓ వాహనంలో 20 మంది భక్తులు ఆదివారం ఉదయం భద్రాచలంకు వచ్చారు. ఈ క్రమంలో ముందుగా గోదావరిలో స్నానం చేసేందుకు కరకట్ట కింద వరకు వాహనంలో వెళ్లి తమ వాహనాన్ని అక్కడే నిలిపి అందరూ అందులోకి దిగారు. వీరిని గమనించి ఇద్దరూ దొంగలు సదరు వాహనంలోకి ప్రవేశించి నగదు చోరీ చేసి కిందకు దిగే సమయాన స్థానికులు గుర్తించి పట్టుకుని సదరు భక్తులను పిలిచారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని తమ వద్ద ఉండాల్సిన నగదు రూ.30వేలు లేకపోవడంతో పట్టుబడిన దొంగల జేబులు వెతకగా రూ.30వేలతో పాటు మరో రూ.1,700 లభించాయి. ఈ క్రమంలో స్థానికులు భద్రాచలం టౌన్‌ సీఐ నాగరాజుకు సమాచారం ఇవ్వగా.. వారు ఆ దొంగలను స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు దొంగలపై ఇదివరకే రెండు కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

తాళం వేసి పరారైన భర్త, అత్త

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య1
1/1

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement