
పూర్తయిన పాసేజ్ పిల్లర్ నిర్మాణం
● పిల్లర్ పటిష్టతపై అధికారుల ఆరా ● కొనసాగుతున్న లైనింగ్ పనులు
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రాజెక్ట్ ప్రధాన కాల్వపై నిర్మించిన సూపర్ పాసేజ్ పిల్లర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండలపరిధిలో 48.30 కి.మీ వద్ద ఎగువ భాగంలో వరద నీటిని ప్రధాన కాల్వ దాటేందుకు రూ.కోటి వ్యయంతో సూపర్పాసేజ్ నిర్మించారు. అయితే పాసేజ్ ఎడమ వైపు పిల్లర్ (వీకే రామవరం శివారులో గల పంప్హౌస్–2 నుంచి పంప్హౌస్ –3 కమలాపురంకు వెళ్లే దారిలో) కూలిపోయిన విషయం విదితమే. ఈ విషయమై పత్రికల్లో కథనాలు రావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యాన మెయిన్ కెనాల్ నిర్మించిన ఏజెన్సీతో నూతన పిల్లర్ నిర్మిస్తామని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఈక్రమంలో దిద్దుబాటు చర్యలు ఆరంభించారు.
గత రెండు నెలల నుంచి..
గత రెండు నెలలుగా పిల్లర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇవి గత పది రోజుల క్రితం పూర్తయ్యాయి. దీంతో పాసేజ్కు సపోర్ట్గా వేసిన ఐరన్ రాడ్లను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా, భూమిపొరల్లో కదలిక వల్ల నిర్మించిన నాలుగేళ్లలోనే ఎడమ పిల్లర్ కూలిన నేపథ్యాన సంబంధిత శాఖ అధికారులు మరింత పటిష్ట చర్యలకు ఉపక్రమించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోకుండా నేరుగా ప్రధాన కాలువలోకి వెళ్లేందుకు కాంక్రీట్ లైనింగ్ వేస్తున్నారు. కూలిన పిల్లర్కు ఎదురుగా గల కుడివైపు పిల్లర్ పటిష్టతపై కూడా దృష్టి సారించారు. ఈ పిల్లర్ చుట్టూ కాంక్రీట్లైనింగ్ వేస్తున్నారు. నూతనంగా నిర్మించిన పిల్లర్ చుట్టూ కూడా లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు నీటిపారుదలశాఖ ఈఈ అర్జున్ తెలిపారు.

పూర్తయిన పాసేజ్ పిల్లర్ నిర్మాణం